
క్రికెట్ మీద ప్రేమ
టైటిల్ : మిస్టర్ అండ్ మిసెస్ మహి
ప్లాట్ ఫాం : నెట్ఫ్లిక్స్
డైరెక్షన్ : శరణ్ శర్మ
కాస్ట్ : రాజ్కుమార్ రావ్, జాన్వీ కపూర్, రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా
మహేంద్ర అగర్వాల్ (రాజ్కుమార్ రావు) ఇండియన్ క్రికెట్ టీంలో చేరాలని కలలు కంటాడు. కానీ.. ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతాడు. తర్వాతి ఏడాది ట్రై చేయాలి అనుకుంటాడు. కానీ.. అందుకు మహేంద్ర తండ్రి ఒప్పుకోడు. మహేంద్ర బతిమిలాడినా పట్టించుకోకుండా షాప్ బాధ్యతల్ని అప్పగిస్తాడు. తర్వాత మహిమ అగర్వాల్ (జాన్వీ కపూర్)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. మహీకి మహేంద్ర తన ఫెయిల్యూర్ స్టోరీ చెప్పినా.. అతని మనసు నచ్చి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఆమె ఒక డాక్టర్ అయినా.. క్రికెట్ అంటే పిచ్చి. అలా ఇద్దరికీ క్రికెట్ మీద ప్రేమ ఉండడంతో వాళ్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మహేంద్ర కల నెరవేరిందా? లేదా?
దేశం కోసం బంగారు పతకం
టైటిల్ : చందు ఛాంపియన్, ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్షన్ : కబీర్ ఖాన్, కాస్ట్ : కార్తీక్ ఆర్యన్, విజయ్ రాజ్, భువన్ అరోరా, రాజ్పాల్ యాదవ్
ఈ సినిమా1972లో భారతదేశానికి పారాలింపిక్స్లో మొదటి స్వర్ణ పతకం సాధించిన మురళీకాంత్ పేట్కర్ అనే అథ్లెట్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. మురళీకాంత్ పేట్కర్ (కార్తీక్ ఆర్యన్) ఆర్మీలో పనిచేసేవాడు. కానీ.. ఒక యుద్ధంలో గాయాలైన మురళీ వీల్ఛైర్కు పరిమితవుతాడు. అయినా.. అతనికి దేశం మీద ప్రేమ తగ్గదు. దేశం కోసం ఇంకా ఏదైనా చేయాలి అనుకుంటాడు.
నడవలేనప్పటికీ మురళీకాంత్ భారత్కు పారా ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధించాలి అని గట్టి నిర్ణయం తీసుకుంటాడు. అందుకు కారణం అప్పటివరకు పారాలింపిక్స్లో ఇండియాకు స్వర్ణం రాకపోవడమే. అందుకే పట్టు వదలకుండా ప్రాక్టీస్ చేసి పారాలింపిక్స్లో స్విమ్మింగ్లో బంగారు పతకాన్ని సాధించాడు. అతని స్పూర్తిదాయకమైన కథనే ‘చందు ఛాంపియన్’గా తెరకెక్కించారు.
భర్త కోసం..
టైటిల్ : సావి
ప్లాట్ ఫాం : నెట్ఫ్లిక్స్
డైరెక్షన్ : అభినయ్ డియో
కాస్ట్ : అనిల్ కపూర్, దివ్య ఖోస్లా, హర్షవర్ధన్ రాణే, రాగేశ్వరి లూంబా, మైరాజ్ కక్కర్, ఎంకే రైనా, హిమాన్షి చౌదరి
నకుల్ సచ్దేవ్ (హర్షవర్ధన్ రాణే) కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ యజమాని నకుల్ని ఎప్పుడూ అవమానిస్తుంటుంది. హఠాత్తుగా ఒకరోజు ఆమె హత్య జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఆ నేరం నకుల్ మీద పడుతుంది. భార్య సావి (దివ్య ఖోస్లా), కొడుకు ఆదిత్య (మైరాజ్ కక్కర్)తో హాయిగా ఉన్న అతని కుటుంబం ఒక్కసారిగా చిన్నాభిన్నం అవుతుంది. తాను ఆ హత్య చేయలేదని నకుల్ ఎంత చెప్పినా.. సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉండడంతో 12 ఏండ్ల జైలు శిక్ష పడుతుంది. కానీ.. అతని భార్య సావి మాత్రం తన భర్త ఏ తప్పు చేయలేదని నమ్ముతుంది.
అందుకే అతన్ని జైలు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతుంది. కానీ.. నకుల్ హై–సెక్యూరిటీ జైలులో ఉంటాడు. అక్కడి నుంచి తప్పించడం అంత ఈజీ కాదు. దాంతో తప్పు చేయకపోయినా జైలు జీవితం గడిపిన రచయిత జోయ్దీప్ పాల్ (అనిల్ కపూర్)ని కలుస్తుంది సావి. పాల్ సాయంతో జైలు నుంచి నకుల్ని తప్పించేందుకు ప్లాన్ రెడీ చేస్తుంది. ప్లాన్ని అమలు చేయడంలో పాల్ మారువేషాలు వేసుకుని ఆమెకు సాయం చేస్తుంటాడు.
ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? నకుల్ జైలు నుంచి తప్పించుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.
కొడుకు కోసం తండ్రి
టైటిల్ : చట్నీ సాంబార్
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
డైరెక్షన్ : రాధా మోహన్
కాస్ట్ : యోగిబాబు, వాణి భోజన్, క్రిష్ హసన్, లాంగో, చంద్రమౌళి పి.ఎస్., నితిన్ సత్య, సంయుక్త విశ్వనాథన్, నందిని మైనా
రత్నస్వామి (నిళల్ గల్ రవి) ఊటీలో ‘అముద’ పేరుతో ఒక హోటల్ నడుపుతూ ఉంటాడు. ఆ హోటల్ ‘సాంబార్’కి చాలా ఫేమస్. అక్కడ సాంబార్ రుచి చూసిన వాళ్లంతా రుచి అమోఘం అని చెప్తుంటారు. భార్య జయలక్ష్మి (మీరా కృష్ణన్), కొడుకు కార్తీక్ (చంద్రన్), కూతురు అముద (మైన నందిని) ఆమె భర్త.. ఇదే రత్నస్వామి కుటుంబం. అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటారు. వాళ్ల ఇంట్లో పనిమనిషి సోఫీ (వాణి భోజన్)ని కూడా కుటుంబంలో ఒకరిగా చూసుకుంటారు. కార్తీక్ అదే ఊళ్లోని జెన్సీ (సంయుక్త)ని ప్రేమిస్తుంటాడు. ఆమె తండ్రి, కార్తీక్ తండ్రి రత్నస్వామి మంచి ఫ్రెండ్స్.
అయినా.. తన కూతుర్ని కార్తీక్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. సరిగ్గా ఆ టైంలో రత్నస్వామి అనారోగ్యం పాలవుతాడు. డాక్టర్లు అతను ఎక్కువ కాలం బతకడం కష్టమని తేల్చేస్తారు. దాంతో.. కొడుకుని మాత్రమే తన గదికి పిలిపించుకుంటాడు రత్నస్వామి. తాను యవ్వనంలో ఉన్నప్పుడు చెన్నై లో అముద (దీపా శంకర్) అనే అమ్మాయితో రిలేషన్లో ఉన్నానని చెప్తాడు. తనవల్ల ఆమెకి ఒక కొడుకు పుట్టాడని.. అముద కొన్నాళ్ల క్రితం చనిపోయిందని చెప్తాడు. అతని ఆచూకీ తెలుసుకుని తీసుకొచ్చి, అతని చేత తలకొరివి పెట్టించుకోవడమే తన చివరి కోరిక అని చెప్తాడు కార్తీక్తో.
అంతేకాదు.. అతన్ని కూడా తమ కుటుంబ సభ్యుడిగానే చూడాలని కొడుకు దగ్గర మాట తీసుకుంటాడు. దాంతో.. కార్తీక్ తన తండ్రి దగ్గర అముద ఫొటో తీసుకుని చెన్నైకి వెళ్తాడు. అముద కొడుకు సచిన్ (యోగిబాబు)ని కలుస్తాడు. అక్కడ అతని ఇడ్లీ బండి చాలా ఫేమస్. ఆ ఏరియాలో అతను చేసే చట్నీ రుచిగా ఉంటుందనే పేరుంది. కార్తీక్ ద్వారా విషయం తెలుసుకున్న సచిన్... రత్నస్వామిని చూసేందుకు ఊటీకి వెళ్తాడు. తర్వాత రత్నస్వామి చనిపోతాడు. అతని అంత్యక్రియలు కూడా సచిన్ చేతుల మీదుగానే జరుగుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? సచిన్ విషయంలో రత్నస్వామి భార్య, కూతురు ఎలా రియాక్ట్ అయ్యారు? అతన్ని వాళ్ల ఫ్యామిలీ మెంబర్గా అంగీకరించారా? లేదా? కార్తీక్కి జెన్సీని ఇచ్చి పెళ్లి చేయకపోవడానికి కారణం ఏంటి?
ప్రతీకారం
టైటిల్ : భయ్యా జీ
ప్లాట్ ఫాం : జీ5
డైరెక్షన్ : అపూర్వ్ సింగ్ కర్కి
కాస్ట్ : మనోజ్ బాజ్పేయి, సువీందర్ విక్కీ, జతిన్ గోస్వామి, విపిన్ శర్మ, జోయా హుస్సేన్
రామ్ చరణ్ (మనోజ్ బాజ్పేయి) తమ్ముడు వేదాంత్ ఊరికి దూరంగా సిటీలో చదువుకుంటుంటాడు. ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన గొడవల్లో అభిమన్యు (జతిన్ గోస్వామి) అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. అభిమన్యు తండ్రి చంద్రభాన్ సింగ్ (సువీందర్ విక్కీ) పెద్ద రాజకీయ నాయకుడు. ఆ హత్య అభిమన్యు చేయలేదని నమ్మిస్తాడు. విషయం తెలుసుకున్న రామ్ చరణ్ చాలా బాధపడతాడు.
రామ్ చరణ్ బిహార్లో ఒక పెళ్లి తంతులో ఉన్నప్పుడు అతని తమ్ముడి హత్య విషయం తెలుస్తుంది. ఆ దుఃఖంలో రామ్ చరణ్ మధ్యతరగతి మనిషిలా అనిపిస్తాడు. కానీ.. తమ్ముడి అంత్యక్రియలు పూర్తయ్యాక అసలు విషయం తెలుస్తుంది. రామ్చరణ్ మరో పేరు భయ్యాజీ. లోకల్గా పెద్ద గ్యాంగ్స్టర్. కానీ.. కొన్ని కారణాల వల్ల రౌడీయిజాన్ని వదిలేసి బతుకుతుంటాడు. తమ్ముడి చావుతో అతనిలోని భయ్యాజీ నిద్ర లేస్తాడు. తన తమ్ముడి చావుకి కారణమైన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు పాత భయ్యాజీగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అభిమన్యుని భయ్యాజీ చంపాడా? లేదా? అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి.
దొంగలెవరు?
టైటిల్ : ప్యారడైజ్
ప్లాట్ ఫాం : మనోరమా మ్యాక్స్
డైరెక్షన్ : ప్రసన్న వితనాగె
కాస్ట్ : రోషన్ మాథ్యూ , దర్శన రాజేంద్రన్ , మహేంద్ర పెరీరా, శ్యామ్ ఫెర్నాండో, సుమిత్ ఇలంగో, అజర్
అమృత (దర్శన రాజేంద్రన్), కేశవ్ (రోషన్ మాథ్యూ)లు కేరళకు చెందిన జంట. ఐదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీలంక టూర్కి వెళ్తారు. సరిగ్గా అదే టైంలో(2022) అక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతుంటాయి. కేశవ్, అమృత అక్కడున్న రామాయణం కాలం నాటి ప్రదేశాలను చూసేందుకు ఆండ్రూ (శ్యామ్ ఫెర్నాండో) అనే గైడ్ని బుక్ చేసుకుంటారు. ఒకరోజు టూరిస్ట్ ప్లేస్లు చూసిన తర్వాత దగ్గర్లోని గెస్ట్ హౌజ్లో సేదతీరుతారు. అదే రోజు రాత్రి ముగ్గురు వ్యక్తులు ఆ గెస్ట్హౌజ్లోకి చొరబడి వాళ్ల ల్యాప్టాప్, ఫోన్లు దొంగతనం చేస్తారు.
అయితే.. ఆ ల్యాప్టాప్లో కేశవ్కు సంబంధించిన ముఖ్యమైన డాటా ఉండడంతో వాళ్లు పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. కానీ.. అప్పటికే అక్కడ క్రైసిస్ విపరీతంగా ఉంటుంది. దాంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు పోలీసుల వెహికల్స్లో కావాల్సింత ఫ్యూయెల్ కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఈ జంటకు ఎదురైన అనుభవాలు ఏంటి? పోలీసులు వాళ్ల గాడ్జెట్స్ రికవరీ చేశారా? లేదా?